Alternaria helianthi
శీలీంధ్రం
ఆతిథేయ మొక్క యొక్క ఆకులు, పత్రవృంతాలు, కాండం, రక్షక పత్రాలు మరియు పూరేకులపై గోధుమ రంగు మచ్చలు కనిపించవచ్చు. ఈ శిలీంధ్రం మొలకల ఎండు తెగులు మరియు పుష్పగుచ్ఛాల కుళ్ళు వ్యాధిని కలుగజేస్తుంది. ఆకులపై, ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులో ఉండి, లేత రంగు అంచు మరియు పసుపు రంగు వలయంతో ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ వాటి పరిమాణం సుమారు 2-3 సెం.మీ. వ్యాసం వరకు పెరిగి, చివరికి ఒకదానితో మరొకటి కలిసిపోయి క్రమరహిత ఆకారపు మచ్చగా ఏర్పడతాయి. దీనివల్ల ఆకులు ఎండు తెగులుకు గురై వాడిపోతాయి. వీటి చుట్టూ పాలిపోయినటువంటి ప్రాంతం (క్లోరోటిక్ జోన్) ఉండి, మధ్యలో బూడిద-తెలుపు రంగులో నిర్జీవమైన మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు మొదట కింది ఆకులపై కనిపించి, ఆ తర్వాత మధ్య మరియు పై ఆకులకు వ్యాపిస్తాయి. కాండంపై, మచ్చలు గుండ్రంగా, పొడవుగా లేదా చారలున్న నల్లటి మచ్చలు ఏర్పడతాయి. రక్షక పత్రాలు మరియు పూరేకులపై మచ్చలు ఆకులపై ఉన్నవాటిని పోలి ఉంటాయి కానీ చిన్నవిగా (0.5-2 సెం.మీ. వ్యాసం) ఉండి ఒకదానితో మరొకటి కలిసిపోతాయి. ఈ సంక్రమణ వలన కలిగే పరిణామాలు ఎండు తెగులు మరియు ఆకులు రాలిపోవడం, పువ్వులు మరియు విత్తనపు గుత్తులు నాశనం కావడం, వాడిపోవడం, కాండం పగలడం మరియు చివరికి మొక్క చనిపోవడం. కొన్నిసార్లు పుష్పగుచ్ఛాలు కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది.
శరదృతువులో పంట కోత తర్వాత నేలల స్వీయ-శుభ్రపరిచే సామర్థ్యాన్ని పెంచడానికి, ట్రైకోడెర్మా జాతుల ఆధారిత జీవ ఉత్పత్తులను లేదా మొక్కల వ్యాధికారకాల జీవ నియంత్రణ కారకాలను (బాసిల్లస్ జాతులు, సూడోమోనాస్ జాతులు) ఉపయోగించాలని సిఫార్సు చేయబడింది.
అందుబాటులో ఉంటే నివారణ చర్యలు మరియు జీవ చికిత్సలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఇమాజలిల్ మరియు టెబుకోనజోల్ (దైహిక శిలీంధ్రనాశినులు) కలిగిన శిలీంధ్ర నాశినులతో శుద్ధి చేసిన విత్తనాలను ఉపయోగించండి. మొక్క ఎదిగే దశలో సైమోక్సానిల్ (స్థానికంగా ప్రభావం చూపే శిలీంధ్రనాశకం), బోస్కాలిడ్ మరియు టెబుకోనజోల్ (సిస్టమిక్ శిలీంధ్ర నాశిని) కలిగిన ఫార్ములేషన్ల వాడకంతో ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.
ఈ వ్యాధి ఆల్టర్నేరియా హెలియాంతి అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ వ్యాధికారకం విత్తనాలు మరియు మొక్కల అవశేషాలపై జీవిస్తుంది. మొక్కలు మొలకెత్తిన దశ నుండి పంట కోత దశ వరకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. వెచ్చని, పొడి వాతావరణ పరిస్థితులలో, అడపాదడపా వర్షాలు కురిసినప్పుడు ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుంది. నత్రజని ఎరువులను అధికంగా వాడటం వల్ల మొక్కలకు కలిగే నష్టం తీవ్రమవుతుంది.